విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ గిరిజన నృత్యోత్సవాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా విశాఖలోని ఆంధ్ర యూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్లో ఆ నృత్యోత్సవాలను జరుపుతున్నారు. ఈ జాతీయ గిరిజన ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది గిరిజన కళాకారులు ఈ వేడుకలో పాల్గొన్ని వారి వారి నృత్యాలను ప్రదర్శిస్తున్నారు.
వివిధ గిరిజన సంస్కృతుల సాంప్రదాయ జానపద నృత్యాలకు విశాఖలో జరుగుతున్న జాతీయ గిరిజన నృత్యోత్సవంలో పట్టాభిషేకం జరుగుతున్నది. 14 రాష్టాల గిరిజన నృత్యాలతో గిరిజన కళాకారులు అద్భుత నృత్యాలతో అలరిస్తున్నారు. సాంప్రదాయ వస్త్రాలు, అలంకారాలతో గిరిజన వాయిద్యాలతో చేస్తున్న నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గిరిజన నృత్యాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున విశాఖ వాసులు వస్తున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనుల నృత్యాలను ఒకే వేదికపై చూసి ఆనందించే భాగ్యం కలగడం పట్ల ప్రకృతి నృత్య ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో స్వచ్ఛంగా, ప్రేమగా వీరు చేస్తున్న నాట్యాలుగానీ, వాయిద్యాలుగానీ మదిని దోస్తున్నదని వారు హర్షిస్తున్నారు. ఇలాంటి జాతీయ గిరిజన నృత్యోత్సవాలు విశాఖలో నిర్వహించడం ఇక్కడి వాసుల అదృష్టంగా భావిస్తున్నట్లు నృత్యాలను చూసేందుకు వచ్చిన పలువురు తెలిపారు. ఈ నృత్యోత్సవాల ద్వారా వివిధ ప్రాంతాల్లోని గిరిజనుల నృత్యరీతులు, వాయిద్యాలు, వారి సంస్కృతులు, అలంకరణలను మన చిన్నారులకు తెలిపే అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్నారు.