కృష్ణా జిల్లా : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. దుగ్గిరాల మండలం పరిధిలోని దేవరపల్లి అగ్రహారంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని స్థానికులను వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా అనుకోని అతిథిలా ఓ వైసీపీ నేత ఇంటికి వెళ్లిన నారా లోకేశ్.. వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైసీపీ నేత ఇంటికి వెళ్లిన ఫొటోలను లోకేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
టీడీపీ నేత నారా లోకేశ్ గత రెండు మూడు రోజులుగా మంగళగిరిలో పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విధానాలను తూలనాడారు. దేవరపల్లిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి స్థానిక వైసీపీ నేత వెనిగళ్ల శ్రీకృష్ణప్రసాద్ ఇంటికి లోకేశ్ వెళ్లారు. అనుకోని అతిథిలా లోకేశ్ రావడంతో కృష్ణప్రసాద్, ఆయన కుటుంబీకులు ఆశ్చర్యపోయారు. కృష్ణప్రసాద్ కుటుంబం క్షేమ సమాచారాన్ని లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీ ఆఫర్ చేయగా తాగి బయటకొచ్చారు. కృష్ణప్రసాద్ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేతగా ఉన్నారు. దుగ్గిరాల మండలాధ్యక్షుడిగా, పీఏసీఎస్ చైర్మన్గా పనిచేశారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. నిత్యావసరాలు, పన్నుల భారంతో సామాన్య మానవుడు చితికిపోతుంటే.. ఈ దరిద్రపు ప్రభుత్వం చెత్త పన్ను కూడా వేసి మరింత పేదలుగా మారుస్తున్నదని దుయ్యబట్టారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదల నడ్డీ విరుస్తున్నారని, కుడి చేత్తే పది రూపాయలిచ్చి.. ఎడమ చేత్తే వంద రూపాయలు లాక్కొంటున్నారని విమర్శించారు. పన్నుల భారం తగ్గాలంటే జగన్ను గద్దె దించడం ఒక్కటే మార్గమని ప్రజలకు సలహా ఇచ్చారు.