రాజమండ్రి : కొత్త జిల్లాల ఏర్పాటు తలనొప్పులు ఇంకా ఏపీ సీఎం జగన్ను వీడటం లేదు. ఇప్పటివరకు సీఎం సొంత జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు మార్పులపై ఆందోళనలు కొనసాగాయి. ఇటీవలి మంత్రి మండలి మార్పు కారణంగా ఈ ఉద్యమాలకు కొన్నిరోజులు పుల్స్టాప్ పెట్టినట్లయింది. తిరిగి ఆందోళనలు రాజుకోవడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పలువురు తమ్ముళ్లు పార్టీకి రాంరాం చెప్తుండటంతో వైసీపీ నేతలకు కొత్త ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి.
తాజాగా కోనసీమ జిల్లాలో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. కోనసీమ జిల్లాకు తాము డిమాండ్ చేస్తున్నట్లుగా బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టలేదంటూ కోనసీమ జిల్లా పరిధిలోని రాజోలుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ నెల్లి దుర్గాప్రసాద్తోపాటు దాదాపు 40 మంది రాజీనామా చేశారు. తమను అవమానించిన ఆపార్టీలో ఇమడలేకపోతున్నామని వారు వాపోయారు.
అంతటితో ఆగకుండా అంబేడ్కర్ పేరును పరిగణలోకి తీసుకోని జగన్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటూ, సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ రాజీనామాలపర్వం జిల్లాలోని అన్ని గ్రామాల్లోని దళిత పేటలకు తీసుకెళ్తామని, అయా గ్రామాల్లోని దళితులందరినీ వారివారి పదవులకు రాజీనామా చేయించేలా ఒత్తిడి తెస్తామని వారంటున్నారు. అంబేడ్కర్ను అవమానించేలా ప్రవర్తించిన వైసీపీని అంతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని వారు గంటాపథంగా చెప్తున్నారు.