తిరుపతి జిల్లా : చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఏషియన్ రికార్డ్ బుక్ అవార్డు వరించింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేయాలని సంకల్పించడం పట్ల ఈ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఏషియన్ రికార్డ్ బుక్ ప్రతినిధులు చెవిరెడ్డికి అవార్డును బహూకరించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మట్టి వినాయక విగ్రహాన్ని అందించే కార్యక్రమాన్ని చెవిరెడ్డి ప్రారంభించారు. ఇందుకోసం భారీమొత్తం ఖర్చు పెట్టి వినాయకుడి మట్టి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు.
పర్యావరణహితంగా మట్టి వినాయక ప్రతిమలను 1.24 లక్షల విగ్రహాలను పంపిణీ చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న ప్రయత్నానికి ప్రోత్సాహకరంగా ఏషియన్ రికార్డ్ బుక్ తమ అవార్డుకు ఎంపికచేసింది. తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ విగ్రహాన్ని అందజేసేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి విగ్రహాల తయారీకి పూనుకున్నారు. విగ్రహాలను ఎమ్మెల్యే బృందం త్వరలోనే నియోజకవర్గంలో పంపిణీ చేయనున్నది. చెవిరెడ్డికి ఏషియన్ రికార్డ్ బుక్ అవార్డు రావడం పట్ల ఆయన అనుచరులు, బంధుమిత్రులు, వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
పర్యావరణహిత వినాయక వినాయక విగ్రహాలను తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పెద్దఎత్తున ప్రచారం చేయడం పట్ల తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ (టీవీవీఎంసీ) నాయకులు ప్రశంసలు కురిపించారు. తిరుపతి నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చెవిరెడ్డి ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల తయారీ కేంద్రాన్ని కమిటీ నాయకులు జీ భానుప్రకాష్రెడ్డి, సామంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్ తదితరులు సందర్శించి అభినందించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డిని ఏషియన్ రికార్డ్ బుక్ అవార్డు రావడం సముచితమని కొనియాడారు.