అమరావతి : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ నాయకుల్లో గుబులు పుడుతుంది. ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పునకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుండడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు.
దశల వారీగా ఎమ్మెల్యేలను పిలిచి ఈ విషయం చెబుతుండడంతో ఎక్కడా తమ వంతు వస్తుందేమోనన్న భయం ఛాయలు వైసీపీ ఎమ్మెల్యేలలో స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా(Minister Roja) సెల్వమణి కూడా టికెట్ రావడం లేదన్న ప్రచారంపై స్పందించారు. మంగళవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
నగరి నియోజకవర్గం నుంచి సీటు రావడం లేదన్న వ్యాఖ్యలపై స్పందించారు. ‘తనకు సీటు ఇవ్వకపోయిన ఇబ్బందేమి లేదు. తాను జగనన్న సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణాలైన ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పా. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదని’ పేర్కొన్నారు. తనకు సీటు ఉందో లేదో నన్న విషయం కార్యకర్తలకు, నాయకులకు తెలుసునని వెల్లడించారు. తనకు సీటు లేదని మీరు(మీడియా) ఆనందపడినా ఇబ్బంది ఏమీ లేదని అన్నారు.