మధురవాడ ఐటీ హిల్స్ భూముల కేటాయింపు టీడీపీ హయాంలోనే జరిగిందని, ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్సీసీ కంపెనీకి 2005 అక్టోబర్ 10 న అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ నిబంధనలు జరిగాయని బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన తప్పులను తాము సరిదిద్దుతున్నామని, అయినా టీడీపీ వాళ్లు తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వమే తప్పులు చేసిందని, పైగా వాళ్లే ధర్నాలు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఎన్సీసీకి సంబంధించిన భూముల వ్యవహారంపై టీడీపీకి తలెత్తిన సందేహాలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ముందుగా జరిగిన ఒప్పందాలకు విరుద్ధంగా 2013 సంవత్సరానికి కూడా ఎన్సీసీ సంస్థ నిర్మాణాలను ప్రారంభించలేదని, దీంతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని అప్పటి ప్రభుత్వం భావించిందని వివరించారు. దీంతో సదురు కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని వెల్లడించారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆర్బిట్రేషన్కు వెళ్లాలని అనుకుందని, ఎన్సీసీ కంపెనీ స్టేటస్ కో తెచ్చుకుందన్నారు. ఇక ఈ భూములపై చంద్రబాబు హయాంలోనే టూ మెన్ కమిటీని కూడా వేశారని, ఈ భూముల విలువ 197 కోట్లుగా నిర్ధారించిందని గుర్తు చేశారు. బిజినెస్ రూల్స్ ప్రకారం ఓ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం కుదరదని మంత్రి తెలిపారు. అందుకే గత ప్రభుత్వంలో ద్విసభ్య కమిటీ నిర్ధరించిన రేటు ప్రకారమే జీవో నెంబర్ 67 జారీ చేశామని బొత్స స్పష్టం చేశారు.