అమరావతి : ఏపీలో రామరాజ్యం రావాలంటే మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరమని బీజేపీ చీఫ్ పురందేశ్వరి (Purandeshwari) అన్నారు. మంగళవారం విజయవాడలో బీజేపీ(BJP) పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి (Alliance) గెలుపుతోనే రామరాజ్యం వస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం(YCP) విపరీతంగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని, గ్రామ పంచాయతీ నిధులను సైతం దారి మళ్లించారని మండిపడ్డారు.
ప్రభుత్వ భూములను తనఖా పెట్టారని విమర్శించారు. వైఎస్ జగన్ను గద్దె దించే లక్ష్యంగా కూటమికి ఒకటే ఎజెండా ఉందని స్పష్టం చేశారు. అవినీతి పాలన అంతమొందించాలి.. సుపరిపాలన రాష్ట్రంలో తీసుకురావాలన్న సంకల్పంతో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. పార్లమెంట్, అసెంబ్లీ కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని సూచించారు.