Kurnool | కర్నూల్ : కర్నూల్ జిల్లాలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. మగాళ్లు మగువల్లా మారి.. రతి మన్మధులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆచారం ఎప్పట్నుంచో కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. ప్రతి ఏడాది హోలీ పండుగ ప్రారంభమైనప్పటి నుంచి వారం రోజుల పాటు ఇలాగే తయారై పూజలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.
కర్నూల్ జిల్లా ఆదోని మండలం సంతేకుళ్లురు గ్రామంలో రతి మన్మధులు అనే ఆయలం ఉంది. ఇక్కడ మగవారు ఆడవారి వేషధారణలో వచ్చి.. రతి మన్మధులకు పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని స్థానికులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ యువకుడు మాట్లాడుతూ.. సాధారణంగా హోలీ పండుగ వచ్చిందంటే రంగులతో పండుగ జరుపుకుంటారు. కానీ తమ గ్రామంలో మగవారు స్త్రీల వేషం వేసుకుని రతి మన్మధులకు పూజలు నిర్వహించి కోరికలు కోరుతారు. ఈ పూజలు నిర్వహించడం ద్వారా కుటుంబాలను చల్లగా చూస్తాడని, వ్యాపారంలో, ఆరోగ్యంలో మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. గత ఏడు సంవత్సరాల నుంచి తాను ఈ వేషధారణలో వచ్చి పూజలు నిర్వహిస్తున్నాను. తన నాన్న ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యులకు చూపించాం. కానీ మెరుగు పడలేదు. తాత ఆదేశాల మేరకు నాన్న ఆడవారి వేషధారణలో వచ్చి పూజలు నిర్వహించిన తర్వాత బాగైంది. ఆ తర్వాత నాన్న ఆదేశంతో తాను కూడా ప్రతి ఏడాది ఒక రోజు ఇలా మగువల మారి పూజలు నిర్వహిస్తున్నాను. తాను కోరిన కోరికలన్నీ తీర్చుతున్నాడు ఆ దేవుడు. ఈ వారం రోజుల పాటు పూజలు నిర్వహిస్తే ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతాడని గ్రామస్తుల నమ్మకం అని యువకుడు కేదార్నాథ్ తెలిపారు.