నెల్లూరు జిల్లా: నెల్లూరు, మేకపాటి సంగం బరాజ్లను ఈ నెలాఖరుకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బరాజ్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించేందుకు సమయం కేటాయించారు. సంగం బరాజ్కు స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరు పెట్టారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం ముంగమూరు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సోమశిల జలాశయం నుంచి వృథాగా పోతున్న నీటిని తరలించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సంగం వద్ద బరాజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2014 నాటికి 50 శాతం పనులు పూర్తయ్యాయి. టీడీపీ హయాంలో బరాజ్ నిర్మాణ పనులు మందగించాయి. వైసీపీ అధికారంలోకి రావడంతో మరోసారి ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యంగా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సంగం బరాజ్ ఉండటంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ బరాజ్ను పూర్తిచేసేందుకు గౌతంరెడ్డి దృష్టి పెట్టారు. దురదృష్టవశాత్తు ఈ ఏడాది ఫిబ్రవరి 21 న గౌతంరెడ్డి మరణించారు. దాంతో ఈ బరాజ్కు మేకపాటి గౌతంరెడ్డి సంగం బరాజ్గా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఏకేఆర్ కోస్టల్ జాయింట్ వెంచర్కు 2008-09 లో రూ.126.70 కోట్లతో సంగం బరాజ్ నిర్మాణ పనులు లభించాయి. ఏప్రిల్ 2008 లో పనులు ప్రారంభించిన ఈ ఏజెన్సీ 68 శాతం పూర్తి చేసింది. పునాది స్థాయిలో అసాధారణ మార్పుల కారణంగా 2013 ఆగస్టులో పనులు నిలిచిపోయాయి. ఫౌండేషన్ పనుల్లో మార్పుల కారణంగా పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ఏజెన్సీ కోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు పనులు పూర్తవడంతో సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ బరాజ్లను ప్రారంభించేందుకు ఏపీ నీటిపారుదల శాఖ సిద్ధమైంది.