శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవుళ్లకు మంగళవారం ప్రత్యేక పూజాధికాలను నిర్వహించినట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు చేశారు. అదే విధంగా శివభక్త గణాలకు అధిపతి అయిన బయలు వీరభద్రునికి సాయంకాలం ప్రదోషకాల పూజలు శాస్తోక్తంగా జరిపించారు. ఆరుబయట ఆలయంలో క్షేత్రపాలకుడిగా భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన తీర్ధప్రసాదాలు అందించారు. అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాధి క్రతువులు నిర్వహించారు.
కోవిడ్ ప్రభావం పూర్తిగా తొలిగిపోవాలని.. సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు ఫలోదకాలతో పాటు
హరిద్రోదకం, భస్మోదకం, కుంకుమోదకం, గంధోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, సువర్ణోదకం, పుష్పోదకం మరియు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింపజేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.