AP Minister Kakani | ఆంధ్రప్రదేశ్లో అశోక్కుమార్ అనే వ్యక్తి లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్గా ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నంబర్ ఇచ్చాడు. రుణ వసూళ్లలో భాగంగా లోన్ యాప్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ నంబర్గా ఉన్న మంత్రి కాకాణికే ఫోన్ చేశారు. ఆ లోన్ కట్టాలని కాకాణిపై బెదిరింపులకు దిగారు. సంబంధిత రుణంతో తమకేమీ సంబంధం లేదని మంత్రి పీఏ.. సదరు లోన్ యాప్ నిర్వాహకులకు సమాధానమిచ్చినా వారు వినలేదు. ఫోన్ చేయడం మానేయలేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 79 సార్లు మంత్రి కాకాణికి ఫోన్ చేశారు. ఇక లాభం లేదని ఈ ఫోన్లు చేస్తున్న వారి సంగతి తేల్చాలంటూ జిల్లా ఎస్పీ విజయారావుకు మంత్రి కాకాణి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన నెల్లూరు పోలీసులు రంగంలోకి దిగితే.. యాప్ నిర్వాహకులు చెన్నైలో ఉన్నట్లు తేలింది. చెన్నైకి వెళ్లి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి.. నెల్లూరుకు తీసుకొచ్చారు.
రుణాల పేరిట ఎవరైనా వేధింపులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను జిల్లా ఎస్పీ విజయరావు కోరారు. కొందరు వ్యక్తులు మంత్రి కాకాణికి ఫోన్ చేసి, రుణ బకాయిలు చెల్లించాలని బెదిరింపులకు దిగారని చెప్పారు. ఫోన్ కాల్స్తో విసిగిపోయిన మంత్రి కాకాణి తమ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దానిపై దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు కోల్మేన్స్ సర్వీసెస్ అనే రికవరీ సంస్థ నుంచి ఫోన్ చేశారని ఎస్పీ వివరించారు.
నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన కాపునేస్తం కార్యక్రమానికి హాజరైన మంత్రి కాకాణి గోవర్ధన్ మాట్లాడుతూ.. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలపై రియాక్టయ్యారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న తన ఫోన్ నంబర్కు 79 సార్లు ఫోన్ చేశారని చెప్పారు. దీనిపై ఆరా తీస్తే అశోక్ కుమార్ అనే వ్యక్తి తన ఫోన్ నంబర్ ప్రత్యామ్నాయంగా ఇచ్చినందునే ఫోన్ చేస్తున్నామని లోన్ యాప్ నిర్వాహకులు చెబుతున్నారని మంత్రి కాకాణి అన్నారు.
లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలపై తన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చెప్పారు. వారిని విడిపించడానికి 10 మంది ప్రముఖ లాయర్లు రావడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. లోన్ యాప్ నిర్వాహకులను ట్రాప్ చేయడానికి తన పీఏ రూ.25 వేలు చెల్లించారని తెలిపారు.
లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు శృతి మించుతున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రినైన తనకే ఇటువంటి పరిస్థితి తలెత్తితే, సాధారణ వ్యక్తుల పరిస్థితేంటన్నారు. అందుకే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో లోన్ యాప్ నిర్వాహకుల ఆటలు సాగకపోవడంతో చెన్నై నుంచి లావాదేవీలు జరుపుతున్నారన్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఎవరు వేధింపులకు పాల్పడినా పోలీసుల దృష్టికి తేవాలని మంత్రి కాకాణి సూచించారు.