అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఫలితం ఎంతో పదో తరగతి ఫలితాల సందర్భంగా వెల్లడైందని మండిపడ్డారు. లక్ష మందికిపైగా టెన్త్లో ఫెయిల్ కావడమేనా జగన్ చెప్పిన ‘నాడు-నేడు’ అని చంద్రబాబు చురకలంటించారు.
‘నాడు-నేడు’ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమం గురించి గొప్పగా చెప్పారని మంగళవారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు. అయితే, నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షల్లో లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో ఈ కార్యక్రమం ఎంత అధమంగా నిర్వహిస్తున్నారో బోధపడుతున్నదన్నారు. లక్షల మంది విద్యార్థులు టెన్త్లో ఫెయిల్ కావడమేనా జగన్ చెప్పిన ‘నాడు-నేడు’ అని దుయ్యబట్టారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని బాధపడుతూ విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చంద్రబాబు సూచించారు. వ్యవస్థలో లోపాల కారణంగా విద్యావ్యవస్థ అధ్వానంగా మారిందని, దీని వల్ల విద్యార్థులు ప్రాణాలు తీసుకోవద్దని హితవు పలికారు.
ఇలా ఉండగా, పదో తరగతి ఫలితాలపై టీడీపీ నేతల కౌంటర్లుపై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. టెన్త్ కూడా అందరినీ పాస్ చేసి పంపించాలా? అని ప్రశ్నించారు. కాపీ కొట్టేందుకు అవకాశం ఉండే బిట్ పేపర్ను తీసేయడం కూడా ఒక కారణం కావచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఫెయిల్ కావడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారని, అయితే, దేన్ని తప్పుపడుతున్నారో స్పష్టం చేయాలన్నారు. పరీక్షలు ఉండాలా? వద్దా? చెబితే బాగుంటుందని సూచించారు.