Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులకు అంకాలమ్మ దర్శనం ఇచ్చారు. ఇక కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని కుమారస్వామికి అభిషేకాలు, షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబి, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేశారు. అటుపై స్వామి అమ్మవార్లకు ఊయలసేవ చేశారు. ఈ సందర్భంగా ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించారు. అష్టోత్తరం,త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్త్ర నామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.