AP News | వైసీపీ నుంచి అంతా బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కొణతాల సమావేశమయ్యారు. భేటీ అనంతరం కొణతాల మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర సమస్యలపై పవన్ కళ్యాణ్తో చర్చించామని తెలిపారు. ఉత్తరాంధ్రను దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా జనసేనానిని కోరినట్లు తెలిపారు.
ఉత్తరాంధ్ర నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే చాలా మంచిదని కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిల.. తనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారని బయటపెట్టారు. కానీ తను జనసేనలో చేరుతుండటంతో కాంగ్రెస్లోకి రాలేనని స్పష్టం చేసినట్లు తెలిపారు. తాను, షర్మిల ఇద్దరు కూడా వైసీపీలో ఉండాల్సిన వాళ్లమేనని.. కానీ పార్టీలో ఉన్న పరిస్థితుల కారణంగా బయటకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ నుంచి అంతా బయటకు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.