తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూలై 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.