తిరుపతి : తిరుచానూరు(Tiruchanur) పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam ) వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు.
16 నుంచి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు
పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా సెప్టెంబరు 15న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.
11 పరదాలు విరాళం ..
హైదరాబాదుకు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి అనే భక్తుడు ఆలయానికి 11 పరదాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు బాబుస్వామి, అధికారులు పాల్గొన్నారు.