తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. స్థల పరిశీలన, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆలయ జేఈఓ వీరబ్రహ్మం బుధవారం సమీక్షించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇంజినీరింగ్, ఆలయ అధికారులతో చర్చించారు. ఏప్రిల్ 10 నుంచి 18 వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 19న పుష్పయాగం జరుగతుందన్నారు. ఇందుకోసం ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ, షెడ్లు, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
స్వామివారి కల్యాణానికి వేలాదిగా వచ్చే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తెలిపారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారీకేడ్లు, కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. జెఈఓ వెంట టీటీడీ సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ (ఎలక్ట్రికల్స్) వెంకటేశ్వర్లు, వీజీఓ మనోహర్, అదనపు ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ సునీల్, ఈఈ శ్రీమతి సుమతి, డీఈ (ఎలక్ట్రికల్స్) చంద్రశేఖర్, డిప్యూటీ ఈఓ డాక్టర్ ఆర్ రమణ్రపసాద్, లక్ష్మణ్ నాయక్ తదితర అధికారులు ఉన్నారు.