Jenasena Party | తిరుమల క్షేత్ర పవిత్రను అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కోరి తెచ్చుకున్న అధికారులు తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం మంటగలిపేసిన తీరు భక్తులను మనోవేధనకు గురి చేసిందని, కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా ధర్మ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను సైతం అడ్డగోలుగా వాడుకునే కుట్రలకు అధికార పార్టీ నాయకులు తెర తీసిన విషయంపై సమగ్ర సమాచారం పార్టీ దగ్గర ఉందన్నారు. తిరుపతిలో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు అనుసరించాలని వ్యూహాలు, తిరుపతి అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ఆయనను కలిశారు. జనసేన పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలు, దౌర్జన్యాలను ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ చేస్తుందని.. దాన్ని మూడు పార్టీలూ సమర్థవంతంగా ఎదుర్కోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇంతకు ముందు సైతం చర్చల్లో బోగస్, దొంగ ఓట్లుపై చర్చ జరిగిందన్నారు. దీనిపై కచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. బూత్ స్థాయిలో కూడా మూడు పార్టీల నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి దొంగ ఓట్లను అడ్డుకోవడం అత్యవసరమన్నారు.
ఈ విషయంలో మూడు పార్టీలు ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పని చేయాలన్నారు. తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసేసిన వైఎస్సార్సీపీని సాగనంపాల్సిన సమయం వచ్చేసిందని.. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతటా ఉందన్నారు. అరాచకాలను, అవినీతికి, గూండాయిజానికీ ప్రతివర్గం నలిగిపోయిందన్నారు. రైతులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, పెన్షనర్లు, వృద్ధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ప్రతి వర్గం వైఎస్సార్సీపీతో బాధలు పడుతోందని.. పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు బెంబేలెత్తిపోయారన్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని బలంగా ఎదుర్కోగలిగేది కూటమి పార్టీలేనని ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు.