అమరావతి: పాఠశాలల్లో తరగతులు వాయిదా వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో వాంఛనీయం కాదని. కోవిడ్ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయాలని పవన్ కోరారు. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని వై.సి.పి.ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జనసేనాని.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరి అర్థమవుతోందని అన్నారు. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు, వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాల్సిన పాలకులు, అవి లేకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటని పవన్ ప్రశ్నించారు.