TDP Pattabhi | ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్, డీజీపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి మాల్దీవులకు వెళ్లారని తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే పట్టాభి ఇంటిపైనా.. ఏపీలోని టీడీపీ కార్యాలయాలపైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలుగా భావిస్తున్న వారు దాడి చేసి, విధ్వంసకాండ సృష్టించిన సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన పట్టాభికి.. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పట్టాభి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న విషయమై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా.. ఆ పార్టీ ప్రభుత్వంపైనా.. డీజీపీపైనా ఆరోపణలు గుప్పించిన పట్టాభి.. రహస్యంగా విదేశాలకు వెళ్లారని తెలియవచ్చింది. మాల్దీవుల్లో సేద తీరేందుకు వెళ్లారా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులు తలెత్తుతాయని వెళ్లారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
హైదరాబాద్ మీదుగా మాల్దీవులుకు విమానంలో వెళ్లిన పట్టాభి.. ఫ్లైట్లో కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మాల్దీవులు రాజధాని మాలే విమానాశ్రయంలో పట్టాభి ప్రత్యక్షమయ్యారని సమాచారం.