అమరావతి : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు ఎక్కడా వస్తుందోనన్న కడుపు మంటతో ప్రతిపక్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపై కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. కోర్టు వ్యవహారాలు పూర్తయిన తరువాత లక్షలాధి మందికి గృహ నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గృహం అనేది ప్రతి మహిళకు సామాజిక హోదా కల్పించడమని అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ ఆగ్రహారంలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సొంతిళ్లు లేని కుటుంబం ఉండకూడదనే తమ మెనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అంతకంటే ఎక్కువగా 30లక్షల 70వేలమందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంటి స్థలాలతో పాటు 15 లక్షల 60వేల ఇండ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు. 17వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలను కట్టిస్తామన్నారు.
ఈ సందర్భంగా పైడివాడ ఆగ్రహారంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి పార్కును ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఆయన ప్రారంభించారు. 2014-2019 వరకు ఉన్న టీడీపీ పాలనలో ఎంతమందికి ఇండ్లను కట్టించింది గమనించాలని కోరారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. చంద్రబాబు పేదలకు ఇండ్లను కట్టించడానికి మనసు రాలేదని ఆరోపించారు. దుష్టచతుష్టయం మూడు రాజధానులను అడ్డు కుంటున్నారని ఆరోపించారు . లంచాలకు, వివక్షతకు, ప్రాంతాలకు తావివ్వకుండా పథకాలు అందజేస్తున్నామని అన్నారు.