Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి తలరాతలు దేవుడు రాస్తే.. తన తలరాతను మాత్రం జగన్ రాస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం, జగన్ కోసం తాను త్యాగానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఆదివారం వైజాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. తాను జగన్కు నమ్మిన బంటునని.. ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని అమర్నాథ్ అన్నారు. జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరమని తెలిపారు. జగన్ ఒక అర్జునుడు అని.. ఆయన సైన్యంలో అమర్నాథ్ ఒక సైనికుడు అని పేర్కొన్నారు. జగన్ తనకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. తనకు చిన్న వయసులోనే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని జగన్ ఇచ్చారని తెలిపారు. పార్టీ ఎవరినీ వదలుకోదని అమర్నాథ్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా వెళ్లిపోతే అది వారి ఇష్టమేనని అన్నారు.
టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకం విషయంలో చంద్రబాబు- పవన్కళ్యాణ్ భేటీపైనా అమర్నాథ్ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా రెండు సీట్లు ప్రకటించినప్పుడు కాపోడు.. మగోడు అనుకున్నా అని అన్నారు. కానీ 25-30 సీట్లకు జనసేన ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోందని తెలిపారు. అదే జరిగితే జనసేన నాయకులు బాధపడకతప్పదని అన్నారు. జనసేనకు ఉన్న బలమెంతో.. టీడీపీతో సర్దుబాటుతోనే తేలిపోతుందని విమర్శించారు.