అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట కలిగించే విధంగా ఏపీ హైకోర్టు తీర్పు నిచ్చింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కొత్త జిల్లా కలెక్టరేట్ల భవనాలను ఎంపిక ప్రక్రియను ఈపాటికే ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే చిత్తూరు జిల్లాను రెండు జిల్లాలుగా విభజించి అందులో ఒక దానికి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. బాలాజీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి గాను టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి నిలయాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.
ఈ విషయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం ఆలయ ఆస్తులను ఇతర వాటికి కేటాయించవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్పై స్టే ఇస్తూ సింగిల్ జడ్జి ఆదేశాలపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది.
ఇరువురి పిటిషన్ను విచారించిన హైకోర్టు ఇవాళ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టేస్తూ కలెక్టరేట్ భవనం ఏర్పాటుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే భవనం ఆకృతుల్లో మార్పులు చేయొద్దని స్పష్టం చేసింది.