దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అడ్డతీగల, అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం, కాకినాడ జిల్లాలో కోటనండూరు, పల్నాడు జిల్లాలో అమరావతి, పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు మండలాలు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. వడగాల్పులు వీచే అవకాశం ఎన్టీఆర్ జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 12 మండలాలు, అనకాపల్లిలో 11 మండలాలు , పల్నాడులో 11 మండలాలు, వైఎస్ఆర్ జిల్లాలో 11 మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 8 మండలాలు.. మరికొన్ని చోట్ల కలిపి మొత్తం 102 మండలాలు ఉన్నాయని ఆయన తెలిపారు.