TTD | శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జులై మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, అష్టదళ పాదపద్మారాధన, స్పెషల్ దర్శనం టికెట్లు, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు దశలవారీగా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుంచి 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని.. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ 21 నుంచి 23వ మధ్యాహ్నం 12 గంటలోగా డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని చెప్పింది.
ఇక ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జులై నెల కోటాను 22న ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను విడుదల చేయనున్నట్లు వివరించింది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ చెప్పింది. శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందించిన భక్తులకు కేటాయించే దర్శన టికెట్ల (జూన్ నెల) ఆన్లైన్ కోటాను ఏప్రిల్ 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని పేర్కొంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ఉద్దేశించిన జులై మాసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదులకు సంబంధించిన కోటాను విడుదల చేస్తామని వెల్లడించింది. భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరింది. అనధికారిక వెబ్సైట్లు, దళారులను ఆశ్రయించొద్దని దేవస్థానం కోరింది.