తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబరు 7న గోకులాష్టమి(Gokulashtami) పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామని ఆలయ అధికారులు వివరించారు. ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన , మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం (Tirumanjanam), సాయంత్రం స్వామివారికి ఊంజల్సేవను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాత్రి 7 నుంచి 8.15 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం (Darsanam) ఇవ్వనున్నారని వివరించారు. రాత్రి 8.30 నుండి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
సెప్టెంబరు 8న ఉట్లోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఊంజల్సేవ సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారికి ఉట్లోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా సెప్టెంబరు 8న ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు (TTD Officers) వివరించారు.