అమరావతి : అమాయక గిరిజనుల్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తోన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరుడు దూడ విక్టర్బాబు దందాలపై దర్యాప్తు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మోసపోయిన గిరిజనులు ఆందోళన సమాచారం తెలుసుకుని వారికి న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చెట్లవాడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దూడ విక్టర్ బాబు ఎమ్మెల్సీ అనంతబాబు కీలక అనుచరుల్లో ఒకరని, అనంతబాబు, వైసీపీ పేరు చెప్పుకుని గిరిజనుల్ని మోసగిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉన్నతపాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు వేయిస్తానని ఏడుగురు గిరిజనుల వద్ద పది లక్షల రూపాయలు వసూలు చేసాడని ఆరోపించారు. వారికి ఉద్యోగాలు వేయించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసగించారని పేర్కొన్నారు.
ఉన్నతాధికారులు స్పందించి మోసపోయిన గిరిజనులకు వెంటనే వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇప్పించా లని, మోసం చేసిన విక్టర్బాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.