శ్రీకాకుళం: గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న గుడ్డెలుగు (ఎలుగుబంటి) ని ఎట్టకేలకు బంధించారు. మత్తు మందు ఇంజెక్షన్ చేసి పట్టుకోగలిగారు. స్థానిక అటవీ శాఖ సిబ్బంది రెండు రోజులుగా ఆపరేషన్ చేపట్టి చివరకు సక్సెస్ కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ ఎలుగు.. వజ్రపుకొత్తూరులో సంచరిస్తూ కొన్ని రోజులుగా ప్రజలను భయపెడుతున్నది. ఎలుగుబంటిని పట్టుకునేందుకు స్థానికులు విఫల యత్నం చేశారు. చివరకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి.. మంగళవారం ఉదయం కిడిసింగిలోని ఓ ఇంట్లో దాక్కున్న ఎలుగుబంటిని పట్టుకున్నారు. అనంతరం బోనులో బంధించి తీసుకెళ్లారు. గుడ్డెలుగును బంధించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
వజ్రపుకొత్తూరు సమీపంలోని జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న రైతులపై దాడి చేసింది. పొలం పనులకు వెళ్లిన గ్రామస్తులపై కూడా దాడి చేసింది. వీరిలో ఒకరు చనిపోగా.. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగుబంటిని పట్టుకుని తమకు ఇబ్బందులు దూరం చేయాలని స్థానికుల కోరిక మేరకు అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. కిడిసింగిలోని ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన అటవీ సిబ్బంది.. మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. ఎలుగుబంటి దాడి విషయం తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.