అమరావతి : ఆవేశంతో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. కుటుంబ కలహాలతో నెల్లూరులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఘటనలో తండ్రి, కుమారుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా మరో ఘటనలో తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కలకలం రేపుతుంది.
నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు అంబాపురంలో నివాసముంటున్న రంగస్వామికి భార్యతో గొడవలు జరుగు తున్నాయి. దీంతో విసుగు చెందిన రంగస్వామి తన ఇద్దరు కొడుకులను తీసుకుని దగ్గరలోని నేల బావి దగ్గరి కి వెళ్లగా పెద్ద కుమారుడు తప్పించుకుని పారిపోయాడు. రామస్వామి, చిన్న కుమారుడు శివ కుమార్ ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. . పెద్ద కుమారుడు ఈ సమాచారాన్ని గ్రామస్థులకు వివరించడంతో హుటాహుటిన బావి దగ్గరకు రాగా అప్పటికే తండ్రి, కొడుకు మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు.
నెల్లూరులోని వింజమూరు పట్టణంలోని జై భీమ్నగర్లో సాదం గీత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు వెంకట్ (10), చరిష్మా (5)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గీత భర్త వెంకట్రావు సమీపంలోని గ్యాస్ గోడౌన్లో గుమస్తాగా పని చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి రాగా భార్య, ఇద్దరు పిల్లలు ఉరేసుకుని ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.