కడప జిల్లా : మంగంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులంతా ఓబులవారిపల్లె మండలం అయ్యలరాసపల్లికి చెందిన వారుగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో అయ్యలరాసపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓబులవారిపల్లెకు చెందిన ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ ఏకైక కుమార్తె పెంచలమ్మ(30) పుట్టుకతో వికలాంగురాలు. ఇంటి వద్ద టిఫిన్ సెంటర్ పెట్టుకుని నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో పదేండ్ల క్రితం రైల్వేకోడూరుకు చెందిన ప్రొద్దుటూరు కృష్ణారెడ్డి ఓబులవారిపల్లెకు విద్యుత్ పని నిమిత్తం వచ్చి పెంచలమ్మను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వీరి ఎనిమిదేండ్ల కుమార్తె సాయిశ్రీ ఉండగా.. మూడు నెలల క్రితం పెంచలమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఓబులవారిపల్లెలో తల్లి వద్దనే ఉంటున్నది. ఈ నేపథ్యంలో శనివారం తన ఇద్దరు పిల్లలు, తల్లి వెంకటసుబ్బమ్మ (58), పొరుగింటి మహిళ వంకన తులశమ్మ (38)తో కలిసి సాయంత్రం 4.30 గంటల వేళ ఆటోలో అత్తగారింటికి బయల్దేరింది.
పెంచలమ్మ భర్త కృష్ణా రెడ్డి ఆటో వెనుక బైక్పై అనుసరించాడు. ఆటో మంగంపేట అగ్రహారం దాటగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఒక్కసారిగా ఢీకొట్టింది. దాంతో తులశమ్మ, సాయిశ్రీ, మూడు నెలల చిన్నారి కౌశిక్ రెడ్డి, ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. అయ్యలరాసపల్లెకు చెందిన ఆటోడ్రైవర్ బాలకృష్ణ, పెంచలమ్మ తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కాగా, దవాఖానలో చికిత్స పొందుతూ పెంచలమ్మ తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఆటో డ్రైవర్ బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. భార్య, ఇద్దరు పిల్లలు, అత్తను పోగొట్టుకుని రోదిస్తున్న కృష్ణారెడ్డి గుండెలవిసేలా రోధిస్తున్నాడు. మంగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.