Fire Accident : విజయవాడలోని ఆటోనగర్లో ఉన్న హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం షోరూంకు సెలవు కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది. భవనం పైఅంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటోనగర్లోని హ్యుందాయ్ షోరూం భవనం పైభాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే మంటలు భవనం పైఅంతస్తును పూర్తిగా చుట్టుముట్టాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకోవడంతో సమీప నివాసితులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.
ఆదివారం సెలవు కావడంతో షోరూంలో సిబ్బంది గానీ, వినియోగదారులుగానీ ఎవరూ లేరు. ఇదేరోజు పనిదినం అయ్యుంటే ఊహించని స్థాయిలో ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు అభిప్రాయపడ్డారు. భవనం పైఅంతస్తులో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయనున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.