తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కళారూపాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదికి చెందిన 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి కళాకారులు వాహనసేవల్లో పాల్గొనను న్నారు. వాహనసేవల సమయంలో విశిష్టతను తెలియజేసేందుకు ప్రముఖ పండితులు వ్యాఖ్యానం చేయనున్నారు.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరితో పాటు ఉత్తరాదికి చెందిన మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ కళారూపాలు ప్రదర్శించేందుకు కళాకారులు తిరుమలకు రానున్నారు.
వాహన సేవల్లో హిందూ ధర్మప్రచార పరిషత్ నుంచి 50, దాస సాహిత్య ప్రాజెక్టు నుంచి 24, అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి 14 కలిపి మొత్తం 88 కళాబృందాలు పాల్గొననున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 63 బృందాల్లో కళాకారులు పాల్గొంటారని టీటీడీ అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి రెండు బృందాలు చెక్క భజన, కోలాటంను ప్రదర్శించనున్నారు.