అమరావతి: ఉక్రెయిన్లో ఉన్న ఏపీ వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇందుకుగాను రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ రంగంలోకి దిగింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని కృష్ణబాబు తెలిపారు. మ్యాపింగ్ చేసిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామని వెల్లడించారు. ఈరోజు 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారమివ్వగా ఇందులో ఏపీకి చెందిన ముగ్గురు ఉన్నట్లు గుర్తించామని స్పష్టం చేశారు.
ఆంధ్రుల కోసం ఢిల్లీ ఎయిర్పోర్టులో ఏపీ భవన్ తరఫున హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని ఏపీ విద్యార్థులకు సూచిస్తున్నామని వివరించారు. ఉక్రెయిన్లోని 7 యూనివర్సిటీలో ఏపీ విద్యార్థులు చదువుతున్నారని, వారి వర్సిటీల సమీపంలోని రొమేనియన్ ఎంబసీని సంప్రదిస్తున్నామని ఆయన అన్నారు.
విద్యార్థులు తప్ప ఉక్రెయిన్లోని ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎంతమంది ఆంధ్రులు ఉక్రెయిన్లో ఉన్నారనే వివరాలు రాబడుతున్నామని కృష్ణబాబు వెల్లడించారు. వీసా స్టాపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు పంపే సంస్థే ఏజెన్సీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు.