ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న బస్సును అడ్డగించి, దాడి చేసింది. బస్సు అద్దాలను పగులగొట్టి, అమాంతం వెనక్కి తోసేసింది. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ, కింది దిగి పరుగులు తీశారు. ఓ ప్రయాణికుడి వెంట పడగా, అతను త్రుటిలో తప్పించుకున్నాడు. కర్రల సాయంతో బెదిరిస్తూ ఏనుగును తరిమేందుకు ప్రయత్నించగా, అది మరింత రెచ్చిపోయింది. అక్కడే ఉన్న ఆర్తాం గ్రామ సచివాలయంపై దాడి చేసి, అక్కడ పార్క్ చేసిన రెండు వాహనాలను ధ్వంసం చేసింది. కొద్దిసేపటి తర్వాత పంట పొలాల మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడిలో దంపతులు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు.
-హైదరాబాద్, నమస్తే తెలంగాణ