అమరావతి : కాకినాడ జిల్లాలో దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసిన ఘటనపై రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ కేసును నీరుగార్చడానికి ఏపీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని, అనంతబాబును పోలీసులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని హతుడు తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో వాదనాలు జరిగాయి. అనంతబాబును పోలీసులు కాపాడేయత్నం చేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. అతడిపై 12 కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుబ్రహ్మణ్యంను ఐదుగురు కలిసి చంపారని ఆరోపించారు. మిగతావారిని కాపాడేందుకే తానొక్కడే చంపినట్లు చెప్పాడని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
హైకోర్టు స్పందిస్తూ సీబీఐ తరుపున అదనపు సాలొసిటర్ జనరల్కు కేంద్రం, డీజీపీ, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది . తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.