అమరావతి : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీ వైసీపీ వైఖరిపై మరోసారి రుసరుసలాడారు. సొంత పార్టీ అధిష్టానమే తన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ శ్రీధర్రెడ్డి వైసీపీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో పార్టీ నాయకుడి తీరును వ్యతిరేకిస్తున్న ఆయన మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ అధికారం అనుభవించి చివర్లో బయటకి వెళ్లడం ఇష్టం లేదు . అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డా’ నని వెల్లడించారు.
పార్టీకి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయానికి అండగా నిలుస్తున్న తన అనుచరులకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. వాటిని లెక్క చేయకుండా తన వెన్నంటి నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేపించిన తర్వాత తన రాజీనామా అడగాలని సూచించారు. దీన్ని స్పీకర్ ఆమోదించి ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్ధమని ఎలక్షన్ కమిషన్ కి పంపితే అప్పుడు తాను స్పందిస్తానని వెల్లడించారు.
ఇరుకళల అమ్మవారి జాతర నిర్వహణకు అనుమతి కోసం దేవాదాయ శాఖకు లేఖ రాస్తానని ఇందులో కూడా రాజకీయం చేస్తే అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. టీడీపీ నుంచి పోటీ చేయాలనేది తన ఆకాంక్ష అని , నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబేనని వివరించారు.