అమరావతి : ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు ఈనెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహా పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి అర్ధరాత్రి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతి రావుకు పంపించారు. అనుమతి నిరాకరణకు గల కారణాలను డీజీపీ తెలియజేశారు.
గత ఏడాది కోర్టు అమరావతి నుంచి తిరుపతి దేవస్థానం వరకు నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన షరతును ఉల్లంఘించ డంతో పాటు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారని వివరించారు. పాదయాత్ర సాగిన వివిధ జిల్లాలో 71 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆయా జిల్లాల పోలీసు అధికారు ల సూచనల మేరకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
పాదయాత్ర చేసే క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వివరించారు. కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామని డీజీపీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.