తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనదని అర్చకులు వెల్లడించారు.
వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారని, గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలని వివరించారు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకమని, అందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడిందన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాధం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, అధికారులు పాల్గొన్నారు.