అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి నుంచి అరసపల్లి వరకు చేపట్టనున్న మహాపాదయాత్ర కోసం ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో నాయకులు గుంటూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మదర్థెరిస్సా కూడలి నుంచి వెంకటపురం వరకు ర్యాలీని నిర్వహించారు. బిల్డ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.
అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా గాని ఏపీ మంత్రులు కొంతమంది మూడు రాజధానులపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయవ్యవస్థలపై సదాభిప్రాయం లేదని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సహకారంతో ఈనెల 12 నుంచి పాదయాత్రను నిర్వహిస్తున్నామన్నారు.