అమరావతి : ఏపీ పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వల్ల నేరాల శాతం తగ్గిందని అందుకు వారిని అభినందిస్తున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) వెల్లడించారు. 2023లో (ఇయర్ ఎండింగ్) జరిగిన నేరాలు, వాటి అదుపునకు తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఏడాది దొంగతనాలు (Thefts) , రోడ్డు ప్రమాదాలు, హత్యలు తగ్గాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం కారణంగా సైబర్ నేరాలు 25శాతం తగ్గాయని, సైబర్ నేరాలను అరికట్టేందుకు యంగ్ ఆఫీసర్లకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నామని వివరించారు.
ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి పలు చర్యలు తీసుకున్నామని, దీంతో 7.83 శాతం జాతీయ, రాష్ట్రీయ రోడ్డు ప్రమాదాలు (Road Accidents) తగ్గాయని డీజీపీ స్పష్టం చేశారు. మహిళలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గించామని మహిళలపై 168 మేజర్ కేసులను నేరుగా జిల్లా ఎస్పీలకు కేటాయించి పరిష్కరించామని ఆయన అన్నారు. లోక్ అదాలత్ లో 4,01,748 పెట్టీ కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు.
రాష్ట్రంలో రౌడీ షీటర్స్ (Rowdy Sheeters)పై ఉక్కుపాదం మోపుతున్నామని, మొత్తం 4 వేలమందిలో వెయ్యి మంది జైల్లో ఉన్నారని ఆయన వివరించారు. గడిచిన మూడు సంవత్సరాల్లో 5లక్షల కిలోల సీజ్డ్ గంజాయిని ధ్వంసం చేశామని పేర్కొన్నారు.