తిరుపతి : రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 111 ఆలయాల నిర్మాణం చేపట్టాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సనాతన ధర్మ వ్యాప్తిలో భాగంగా మత మార్పిడులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో రెండో దశలో ఈ 111 ఆలయాలను నిర్మించనున్నారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో శ్రీవాణి ట్రస్టుపై అధికారులతో ఈఓ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,342 ఆలయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. మొదటి దశలో 502 ఆలయాల నిర్మాణం పూర్తికాగా.. రెండో దశలో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మత్స్యకార ప్రాంతాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 111 ఆలయాల నిర్మాణం జరుగనున్నదని చెప్పారు. వీటిలో శ్రీవారి ఆలయాలు -9, రామాలయాలు-77, హనుమంతుడి ఆలయాలు-2, శివాలయాలు– 3, గ్రామదేవతల ఆలయాలు– 20 ఉన్నాయని వెల్లడించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆలయాల నిర్మాణంపై సమీక్ష జరుపనున్నట్లు చెప్పారు.
నిర్మాణం పూర్తయిన 502 ఆలయాలు, నిర్మాణం జరుగనున్న 111 ఆలయాలకు భజన సామగ్రి అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని హిందూ ధర్మప్రచార పరిషత్ అధికారులను ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. ఈ ఆలయాల్లో అర్చకులుగా నియమించే వారికి శ్వేత ఆధ్వర్యంలో నిత్యపూజా విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షలో టీటీడీ జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏఓ ఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సమరసత సేవా ఫౌండేషన్ ఛైర్మన్ తాళ్లూరు విష్ణు, సెక్రటరీ త్రినాథ్, జాయింట్ సెక్రటరీ సునీల్ తదితరులు పాల్గొన్నారు.