(Congress Rally) తిరుపతి: తిరుమల కొండపైకి వెళ్లేందుకు టీటీడీ నిర్మించతలపెట్టిన అన్నమయ్య మూడో ఘాట్ రోడ్డును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాయం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి వై గోపి ఆధ్వర్యంలో జరిగింది.
తిరుమలను ఏదో అభివృద్ధి చేస్తున్నమని గొప్పలు చెప్పుకోవడానికే అన్నమయ్య ఘాట్ రోడ్డును నిర్మించేందుకు బోర్డు ముందుకొచ్చిందని ఈ సందర్భంగా గోపీ ఆరోపించారు. మామండూర్ నుంచి ఘాట్ రోడ్డు ప్రారంభమైతే.. రానున్న రోజుల్లో తిరుపతి అభివృద్ధి నిలిచిపోవడం ఖాయమన్నారు. దీని వల్ల వ్యాపారాలు దెబ్బతినే అవకాశాలతోపాటు అటవి కూడా నాశనం అవుతుందని విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మజీద్ పటేల్, కొట్టాల మహేశ్ బాబు, ఎన్ ఎస్యూఐ నాయకుడు షేక్ సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, మూడో ఘాట్ రోడ్డు ప్రతిపాదనను టీటీడీ విరమించుకోవాలని రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం (ఆర్ఐఎఫ్) కన్వీనర్ ఎం పురుషోత్తంరెడ్డి డిమాండ్ చేశారు.