అమరావతి : ఏపీలో నూతన మంత్రివర్గ కూర్పు తుది దశకు చేరుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన కోర్ కమిటీతో సమావేశమై మంత్రివర్గంలో ఎవరెవరినీ తొలగించాలో, ఎవరిని తీసుకోవాలో అనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా జగన్కు అత్యంత ఆత్మీయుడిగా కొనసాగుతున్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో మరోమారు తన క్యాంపు కార్యాలయంలో చర్చించనున్నారు. గత రెండు రోజులుగా వీరిద్దరూ కుల, మత, ప్రాంతీయ, జిల్లాల్లో సమీకరణలతో పాటు విధేయతకు కూడా మంత్రివర్గంలో సమ ప్రాధాన్యతా కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.
కాగా రెండు రోజుల క్రితం మొత్తం 24 మంది మంత్రుల రాజీనామా పత్రాలను తీసుకొన్న సీఎం వాటిని గవర్నర్ కు పంపారు. కొత్త మంత్రుల జాబితా గవర్నర్కు అందగానే రాజీనామా జాబితాకు ఆమోదం తెలుపనున్నారు. కొత్త మంత్రివర్గంలో 10 మంది పాతవారు, మరో 15 మందిని కొత్తవారిని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేపు వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉదయం 11.31 గంటలకు నిర్వహించనున్నారు.