శ్రీ సత్యసాయి జిల్లా : హిందుపురంలోని అన్నా క్యాంటీన్లో చికెన్ భోజనం వడ్డించారు. పెద్ద సంఖ్యలో పేదలు అన్నా క్యాంటీన్కు వచ్చి కేవలం 2 రూపాయలకే చికెన్ అన్నం తిన్నారు. ఆదివారం స్పెషల్గా 2 రూపాయలకే చికెన్ రైస్తో పాటు కోడి గుడ్డు, స్వీట్ ఇచ్చారు. దాంతో సండే నాడు అన్నా క్యాంటీన్లో సందడి నెలకొన్నది. హిందుపురంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించి 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్ భోజనాన్ని అందించారు.
ఎన్టీరామారావు జయంతిని పురస్కరించుకుని హిందుపురం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్ ప్రారంభించి ఇవాల్టికి 100 రోజులు పూర్తయ్యాయి. దీనిని పురస్కరించుకుని సండే స్పెషల్గా 2 రూపాయలకు చికెన్ కర్రీతో పాటు అన్నం, కోడిగుడ్డు, స్వీట్ అందించారు. తక్కువ ధరకే చికెన్ కర్రీ భోజనాన్ని నాణ్యతతో అందించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇలాఉండగా, అన్నా క్యాంటీన్లపై రాజకీయ రగడ కొనసాగుతున్నది. కుప్పంలో అన్నా క్యాంటీన్ను వైసీపీ కార్యకర్తలు కూల్చివేయగా.. ఇటు తెనాలీలో కూడా అన్నా క్యాంటీన్ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందన్న సాకుతో తొలగించేందుకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి.. గంటల వ్యవధిలోనే క్యాంటీన్ను తొలగించారు. అధికారులను తీరును టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. అదే ప్రాంతంలో క్యాంటీన్ నిర్వహించి తీరుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్వరంతో చెప్పారు. నందిగామ, మంగళగిరిలో కూడా అన్నా క్యాంటీన్లను ఏర్పాటుచేయకుండా అడ్డుకుంటున్నారని లోకేశ్ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్లను నడిపి తీరుతామని, పేదల ఆకలిని తీరుస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.