అమరావతి: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో జరిగిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు గుండ్లపాడు వెళ్లనున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో టీడీపీకార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
వైఎస్ఆర్సీపీ అవినీతి పాలన ప్రశ్నించిన టీడీపీ శ్రేణులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే జగన్ సర్కారు దాడులకు పాల్పడుతుందని అన్నారు. పల్నాడులోనే ఇప్పటి వరకు పదికి పైగా రాజకీయ హత్యలు జరిగాయన్నారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై దాడి జరిగిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.