అమరావతి : ఏపీలో రాజకీయ మనుగడ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున (Minister Merugu Nagarjuna) విమర్శించారు. రాష్ట్రంలో క్రైస్తవ ఆస్తులు అమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆరోపించడాన్ని ఖండించారు. ఎన్నికలు వస్తున్నాయని ఇష్టమొచ్చినట్లుగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ హయాంలో క్రైస్తవ ఆస్తుల కోసం చంద్రబాబు ప్రయత్నించారని పేర్కొన్నారు. దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, దళితులపై అమానుషంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. గుంటూరు, విజయవాడలో చంద్రబాబు ఎన్ని క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో చూపిస్తామని సవాల్ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా దళితుల మద్దతు వైఎస్ఆర్ పార్టీకే ఉందని, వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోరాడినా చివరకు గెలిచేది, ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్నేనని స్పష్టం చేశారు.