తిరుపతి: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9.15 నుంయి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్వారికి పుష్కరిణి ఎదురుగా వేడుకగా స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహిస్తామని, రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వేదపండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు,కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు.