కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నదని చెప్తూనే.. మరోవైపు ఆయన హత్య కేసులో పెద్దల హస్తం ఉన్నదని జరుగుతున్న ప్రచారంపై నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్పై మరోసారి ఆవేశాన్ని వెళ్లగక్కిన డీఎల్.. జగన్ మాట తప్పరని ఎవరన్నారని ప్రశ్నించారు. శనివారం కడప జిల్లా ఖాజీపేటలో డీఎల్ మీడియాతో మాట్లాడారు.
బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటమి ఖాయమని డీఎల్ జోస్యం చెప్పారు. సీపీఎస్ను రద్దు చేస్తానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్.. సీఎం పీఠం ఎక్కాక ఎందుకు రద్దు చేయలేకపోయారని ప్రశ్నించారు. జగన్ పేరును దిగజార్చేలా సజ్జల మాట్లాతున్నారని, జగన్ అవగాహన లేక హామీ ఇచ్చారని చెప్పడం ఎంతవరకు సబబని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామాను బాగా పండించి సొమ్ము చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
వివేకానంద హత్య కేసులో వైసీపీ నేతల ప్రమేయాన్ని తప్పించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. వివేకా హత్యకేసును సునీత కుటుంబంపైకి నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సునీత కుటుంబానికి ఏ పాపం తెలియదని భావిస్తున్నట్లు తెలిపారు. వివేకా హత్య కేసులో నిందితులెవరూ తప్పించుకోలేరన్నారు.