అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలని ఏపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్ తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించాలంటే ఇంతకంటే మంచి సమయం రాదని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరిస్తే విభజన హామీలు, ప్రత్యేక హోదా నెరవేరుతాయని అన్నారు.
తాము ఓటింగ్లో పాల్గొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేరవేస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు కేంద్రం మెడలువంచుతామని పదేపదే ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్షాల ఓటింగ్ బలం సమానంగా ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ రాజకీయ చతురతను ఉపయోగించాలన్నారు.
వైసీపీ మొగ్గు చూపిన వైపే రాష్ట్రపతి గెలుపు ఉంటుందని తెలిపారు. వైసీపీ ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నా ప్రతిపక్షం గెలుస్తుందని అన్నారు. అయితే జగన్పై ఉన్న కేసుల బూచి చూపి కేంద్రం రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తుందని హర్షకుమార్ ఆరోపించారు. సెప్టెంబర్ 25న రాజమహేంద్రవరంలో దళిత సింహగర్జన నిర్వహిస్తామని వెల్లడించారు.