విజయవాడ: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక నిర్వహణ, వ్యయం చేస్తున్నట్లు బుగ్గన చెప్తున్న విషయాలన్నీ వాస్తవ విరుద్ధాలేనని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. బుగ్గన చెప్పే లెక్కలన్నీ తప్పుడివేనన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో కరోనా ఇబ్బందులు ఉన్నాయంటే ఎవరైనా అంగీకరిస్తారని, కానీ కొవిడ్కు ముందు సంవత్సరాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎలా మభ్యపెడతారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక పత్రాలు చూస్తే మీరు చేపట్టే ఆర్థిక నిర్వహణ దౌర్భాగ్యస్థితి ఎలా ఉందో తెలుస్తుందని చెప్పారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి చేయాల్సిన అప్పులు రూ.37, 029 కోట్ల అంచనా అయితే, మొదటి 9 నెలల్లోనే రూ.58,111 కోట్ల అప్పులు చేశారంటే.. మీరు తయారు చేసిన బడ్జెట్ ప్రకారమే పాలన సాగుతుందా అన్న అనుమానం వస్తుందని పేర్కొన్నారు.
కాగ్ వెబ్సైట్లో ఉన్న ఆర్థిక పత్రాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిర్వహణ లెక్కల బొక్కలు పూర్తిగా బహిర్గతమవుతాయని లంకా దినకర్ తెలిపారు. డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ వాస్తవ మూలధన వ్యయం ఎంత, రెవెన్యూ లోటు ఎంత అని.. ఇవి బడ్జెట్ దరిదాపుల్లో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.